Friday, 3 October 2014

CM Chandrababu Naidu interacting with older persons in the distribution of pensions

అమ్మా....నీ పేరేంటమ్మా? ఎంతమంది పిల్లలున్నారు? వారు నీబాగోగులు చూడటం లేదా? నీ జీవనాధారం ఏమిటి? అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులతో మమేకమయ్యారు. పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సింగ్‌నగర్‌ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించిన చంద్రబాబు తొలుత సిరిపురపు జనమ్మ అనే వృద్ధురాలికి పింఛను అందజేశారు. వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడిన ఆయన కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. భర్త చనిపోయాడని, ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆమె చెప్పింది. వారికే గడవడం కష్టంగా ఉంటే తనను ఏమి చూస్తారని ఆమె బదులిచ్చింది. ఇప్పుడు పెంచి ఇచ్చిన వెయ్యి రూపాయల పింఛను ఏమి చేస్తావంటూ వృద్ధురాలిని ప్రశ్నించారు. మందు బిళ్లలు తన ఆహార ఖర్చులకు వినియోగిస్తానని జనమ్మ చెప్పగా, తనను నిండు మనస్సుతో దీవించాలని చంద్రబాబు కోరారు. అనంతరం కృష్ణ అనే వృద్ధుడికి చంద్రబాబు పింఛను అందజేశారు. ఎంత మంది పిల్లలు ఉన్నారని బాబు ప్రశ్నించారు. ముగ్గురు కుమారులు ఉన్నారని, వారి పిల్లల పెంపకమే వారికి భారంగా ఉంటే తనను చూడటం కష్టంగా మారిందన్నాడు. స్పందించిన బాబు చూశారా? బిడ్డలు చూడకపోయినా వారి కష్టాలను అర్ధం చేసుకునే మనస్తత్వం తల్లిదండ్రులకు ఉంది. అందుకే పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి పేదలను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతో పింఛన్లు వెయ్యి రూపాలయకు పెంచినట్లు వివరించారు.
లంకలపల్లి గోవింద అనే వికలాంగుడు పింఛను తీసుకుని తనకు ట్రైసైకిల్‌ ఇప్పించాలని చంద్రబాబును కోరాడు. అతడికి ట్రైసైకిల్‌ ఇప్పించడంతో పాటు వ్యాపారం చేసుకునేందుకు రుణం ఇప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికపై ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేసిన బాబు 20 నిమిషాలకుపైగా వారితో మమేకమయ్యారు. ఇదే సందర్భంగా వర్షం పడటంతో మంచి పని చేసినప్పుడు దేవుడు నిండు మనస్సుతో ఆశీర్వాదిస్తాడనటానికి ఇదే నిదర్శనం అంటూ బాబు వాఖ్యానించగా, సభికుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

No comments:

Post a Comment